Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన ఇండియన్ మార్కెట్లు:ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల జోరు ఉన్నప్పటికీ, ఆర్థిక, ఆటోమొబైల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం మార్కెట్లను దెబ్బతీసింది.
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల జోరు ఉన్నప్పటికీ, ఆర్థిక, ఆటోమొబైల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం మార్కెట్లను దెబ్బతీసింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి బడా కంపెనీల షేర్లు నష్టపోవడంతో సూచీలు కిందకు జారాయి. నేటి ట్రేడింగ్ సెషన్లో, సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్గా 84,027 పాయింట్ల వద్ద మొదలైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ, ఒకానొక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది.
చివరికి 452 పాయింట్ల నష్టంతో 83,606 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 120 పాయింట్లు కోల్పోయి 25,517 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి షేర్లు లాభాలను ఆర్జించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.74 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 67.58 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు ధర 3,299 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
